కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి: ఎలుకలపై ప్రయోగం సక్సెస్.. త్వరలో మనుషులకు!

కరోనా వైరస్‌‌ విరుగుడుకు వ్యాక్సిన్ అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తులు, పరిశోధన సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వేలిముద్ర పరిమాణంలో ఉండే ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించారు. ఒక పట్టీలా ఉండే ఇది నేరుగా టీకాను ప్రవేశపెడుతుంది. పిట్‌కోవాక్ (పిట్స్‌బర్గ్ కరోనా వైరస్ వ్యాక్సిన్)‌గా దీనికి నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్‌ను పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెంది స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు రూపొందించారు. ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించినప్పుడు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ.. కరోనా వైరస్‌ను నాశనం చేసే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేయగా, రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు గుర్తించారు.



కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ అనే నిర్దిష్ట భాగం ఆధారంగా దీన్ని తయారుచేసినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంజెక్షన్‌ రూపంలో కాకుండా పట్టీ ద్వారా దీన్ని శరీరంలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనివల్ల టీకా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. పట్టీలో దాదాపు 400 సూక్ష్మసూదులు ఉంటాయి. ఇవి స్పైక్‌ ప్రొటీన్‌ భాగాలను చర్మంలోకి ప్రవేశపెడతాయి. చర్మంలో శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన బలంగా ఉంటుంది. ఈ పట్టీని ఒంటిపై అతికించినప్పుడు నొప్పి ఉండదు. ఈ టీకాను సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చని, శీతలీకరించాచాల్సిన అవసరం లేదని వివరించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించనున్నారు.